కట్ చెప్పడం మరచిపోయా.. శర్వానంద్ నటనకు సంపత్ నంది ఫిదా
శర్వానంద్ భోగి సినిమా షూటింగ్ సెట్లో షాకింగ్ ట్విస్ట్. శర్వానంద్ ఎమోషనల్ నటనకు డైరెక్టర్ సంపత్ నందితో పాటు 200 మంది యూనిట్ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వివరాలు ఇవే!
చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఎగసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో హైప్ సృష్టించాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్లోని ఒక భారీ సెట్లో జరిగిన కీలక సన్నివేశం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్ర షూటింగ్ సెట్ నుండి డైరెక్టర్ సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ అప్డేట్ పంచుకున్నారు. ఒక హై-ఎమోషనల్ సీన్లో హీరో శర్వానంద్ అద్భుతమైన నటనతో సెట్ మొత్తాన్ని మెప్పించారని ఆయన వెల్లడించారు. శర్వానంద్ నటనను చూసి తాను ‘కట్’ చెప్పడం కూడా మరచిపోయానని దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆ సీన్ సినిమాకే హైలైట్గా నిలవనుందని క్లారిటీ వచ్చింది. ఈ ఎమోషనల్ సీన్ చూసి షూటింగ్ సెట్లోని 200 మందికి పైగా యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారు. అంతేకాకుండా చాలా మంది భావోద్వేగానికి గురై కళ్లలో నీళ్లు తుడుచుకున్నారని సంపత్ నంది పేర్కొన్నారు. గత పది సంవత్సరాల్లో శర్వానంద్ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో సైతం ప్రేక్షకులు ఖచ్చితంగా అదే భావోద్వేగానికి లోనవుతారని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇదిలా ఉండగా ‘భోగి’ సినిమా 1960ల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఒక కల్పిత గ్రామంలో సాగుతుంది. ఇందులో శర్వానంద్ గంగ అనే అత్యంత శక్తివంతమైన రగ్డ్ పాత్రలో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచనా రాణిగా, డింపుల్ హయాతి మందారంగా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంపత్ నంది తన మాస్ స్టైల్తో శర్వానంద్ను ఒక పవర్ఫుల్ లుక్లో ప్రెజెంట్ చేస్తూ హీరో ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నారు. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేసిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్లు అద్భుతమైన విజువల్స్ అందిస్తాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్తో సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరింది, మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రం ఆగస్టు 28, 2026న రాఖీ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ ఎమోషనల్ అప్డేట్తో ‘భోగి’ కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా బలమైన సామాజిక నేపథ్యం ఉన్న బ్లాక్బస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.