ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్-ఫిలిప్పీన్స్ ద్వైపాక్షిక సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరాయని ఫిలిప్పీన్స్ రాయబారి జోసెల్ ఎఫ్ ఇగ్నాషియో స్పష్టం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఫిలిప్పీన్స్ రాయబారి జోసెల్ ఎఫ్ ఇగ్నాషియో ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన పరివర్తనను సాధించిందని వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు భారత్ వేగంగా ముందడుగు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ మరియు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చరిత్రలోనే ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య మైత్రి గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది. 2023 సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ప్రస్తుతం ఈ వాణిజ్య పరిమాణం 4 బిలియన్ డాలర్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పదేళ్ల విరామం తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ఊతం లభించింది. ఇదిలా ఉండగా భారతీయ పర్యాటకులు మరియు వ్యాపారులకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం 14 రోజుల వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు మైత్రిని మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా రక్షణ మరియు మిలిటరీ రరంగాల్లో సహకారం సరికొత్త వ్యూహాత్మక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో 2025 ఆగస్టులో ఢిల్లీలో ప్రధాని మోదీ మరియు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ మధ్య జరిగిన సమావేశం కీలక మైలురాయిగా నిలిచింది. రెండు దేశాలు ఆర్థిక పురోగతి, చట్టపాలన, ఇంధన భద్రత, ఆహార భద్రత మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఒకే రకమైన సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. ఆసియాన్-భారత్ మరియు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మనీలా పర్యటనను రాయబారి స్వాగతించారు. ఇలాంటి ఉన్నత స్థాయి ప్రతినిధుల వరుస పర్యటనలు రెండు దేశాల సంబంధాలను మరింత సుదృఢం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక, పర్యాటక మరియు రక్షణ రంగాల్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడనుందని స్పష్టం చేశారు.