2036 నాటికి డబ్బు ప్రాధాన్యం తగ్గిపోతుంది - ఎలాన్ మస్క్

2036 నాటికి డబ్బు అర్థం కోల్పోతుందని, ఏఐ, రోబోలు సమృద్ధి యుగాన్ని సృష్టిస్తాయని ఎలన్ మస్క్ సంచలన అంచనా వేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థపై ఒక సాహసోపేతమైన అంచనా వేశారు. ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జాన్నీ మింటన్ బెడోస్‌తో టెక్సాస్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీలో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో, అంటే 2036 నాటికి, డబ్బు ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోయి దాదాపు అర్థం లేని స్థాయికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. మస్క్ అంచనాల ప్రకారం, కృత్రిమ మేధస్సు మరియు హ్యూమనాయిడ్ రోబోలు కలిసి ఒక అద్భుతమైన సమృద్ధి యుగాన్ని తీసుకువస్తాయి. ఈ పరిస్థితిలో వస్తువులు, సేవలు అత్యంత సులభంగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి కొరత అనే భావనే కనుమరుగవుతుంది. మనిషి ఆలోచించగలిగిన దాదాపు ఏదైనా వస్తువు లేదా సేవ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. దీంతో పాటు రాబోయే ఐదేళ్లలో ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును మించిపోతాయని మస్క్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ పరిణామం వల్ల పని చేయడం ఆప్షనల్‌గా మారుతుందని, మనుషులు తమ సమయాన్ని సృజనాత్మక అంశాలకు కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇన్‌ఫ్లేషన్ కాకుండా డీఫ్లేషన్ ప్రధాన సవాలుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉందని మస్క్ సూచించారు. అయితే ఈ వాదనలపై ఆర్థికవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వనరులలో కొరత పూర్తిగా తొలగిపోదని, కేటాయింపు, పంపిణీ సమస్యలు కొనసాగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఏఐ అభివృద్ధి వేగం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అత్యంత సంభావ్య ఫలితం అందరికీ సమృద్ధి అని మస్క్ నమ్ముతున్నారు.ఈ మార్పు మనుషులకు నిజమైన స్వేచ్ఛను ఇస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
By Chandrasekhar B — 31 July 2026