సీఎం విజయ్ మారథాన్ రన్ ద్వారా చెన్నైలో ఆరు కిలోమీటర్లు నాన్స్టాప్గా పరుగెత్తి యువతలో సరికొత్త జోష్ నింపారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఈ ఘనత సాధించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నై నగరంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఒక భారీ అవగాహన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. కేవలం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ట్రాక్ సూట్ ధరించి పరుగు లంకించుకున్నారు. ఈ వినూత్న చర్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతలో సరికొత్త జోష్ నింపారు. చెన్నైలోని ప్రసిద్ధ మెరీనా బీచ్ రోడ్డులో ఈ ప్రతిష్టాత్మక మారథాన్ నిర్వహించారు. స్టార్ట్ రన్, స్టాప్ డ్రగ్స్ అనే నినాదంతో క్రీడల అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యాభైమూడేళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి విజయ్ ఏకంగా ఆరు కిలోమీటర్ల దూరాన్ని నాన్స్టాప్గా పూర్తి చేసి అందరికీ పెద్ద షాకిచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ప్రజలతో కలిసి ఇంత దూరం పరుగెత్తడం తమిళనాడు చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మారథాన్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి విజయ్ అక్కడ గుమిగూడిన వేలాది మందితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన ప్రతిజ్ఞ చేయించారు. తాము ఎప్పటికీ డ్రగ్స్ మహమ్మారి బారిన పడబోమని, సభ్యులను, స్నేహితులను సైతం ఈ అలవాటుకు దూరంగా ఉంచుతామని అందరితో ప్రమాణం చేయించారు. అలాగే అక్కడే ఉన్న బోర్డుపై స్పోర్ట్స్ తీసుకోండి, డ్రగ్స్ వదిలేయండి అంటూ రాసి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆధవ్ అర్జునతో పాటు పలువురు,ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో మెరీనా బీచ్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దీనికి ప్రజల మద్దతు ఎంతో అవసరమని విజయ్ స్పష్టం చేశారు. మారథాన్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి యువతకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రతిరోజూ వ్యాయామం లేదా రన్నింగ్ చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. తమిళనాడును డ్రగ్స్ లేని సురక్షితమైన రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ పరుగు ద్వారా ఆయన యువతకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.